హఠాత్తుగా ధర తగ్గించడంపై ఖమ్మంలో మిర్చి రైతుల ఆందోళన

  • సరుకు అమ్మేది లేదంటూ నిరసన 
  • దీంతో ఖమ్మం మార్కెట్ యార్డు వద్ద ఉద్రిక్తత 
  • పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి సద్దుమణిగిన వైనం

ఒక్క రోజు వ్యవధిలో ధర రూ.5 వేలు తగ్గించడాన్ని నిరసిస్తూ మిర్చి రైతులు ఆందోళనకు దిగడంతో ఖమ్మం మార్కెట్ యార్డు వద్ద ఈ రోజు ఉదయం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వివరాల్లోకి వెళితే, యార్డు వద్ద గడచిన రెండు రోజులుగా జెండా పాట రూ.17 వేలుగా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం హఠాత్తుగా రూ.5 వేలు తగ్గించి రూ.12 వేలుగా నిర్ణయించడంతో రైతులు ఆశ్చర్యపోయారు. 

ఇంతలోనే అంత ఎలా తగ్గుతుందంటూ ఆందోళనకు దిగారు. సరుకును అమ్మేది లేదంటూ యార్డు గేట్లకు తాళాలు వేసి భీష్మించుకుని కూర్చున్నారు. యార్డుకు వచ్చిన మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరమణను రైతులు చుట్టుముట్టారు. ధర పెంచేంత వరకు కదలనిచ్చేది లేదంటూ పట్టుబట్టారు. పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి సద్దుమణిగింది. 

అనంతరం చైర్మన్ వ్యాపారులతో చర్చించి జెండాపాటను రూ.15 వేలుగా నిర్ణయించి వెళ్లిపోయారు. చైర్మన్ వెళ్లిపోయిన తర్వాత వ్యాపారులు మాత్రం ఎప్పటిలాగే రూ.10 వేల నుంచి రూ.12 వేల మధ్య కొంటామనడంతో రైతులు తమ పంట అమ్మేందుకు నిరాకరించారు.

Go Back to Shorts
Khammam District
market yard
mirchi farmers
agitation

More Telugu News