మాపై దాడి చేయమంటూ మంత్రులు, ఎమ్మెల్యేలను జగన్ ప్రోత్సహిస్తున్నారు: గవర్నర్ కు టీడీపీ ఎమ్మెల్యేల లేఖ

  • మమ్మల్ని దూషిస్తున్నారు, బెదిరిస్తున్నారు
  • స్పీకర్ ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు
  • సమావేశాలు సజావుగా జరిగేలా చూడండి
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. శాసనసభలో స్పీకర్ తమ్మినేని సీతారాం, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్న తీరుపై ఫిర్యాదు చేశారు. అప్రజాస్వామికంగా సభను నిర్వహిస్తున్నారంటూ లేఖలో పేర్కొన్నారు. సభా సంప్రదాయాలు, నిబంధనలను అధికార పార్టీ సభ్యులు పాటించడం లేదని... ప్రతిపక్ష సభ్యులను దూషించడం, బెదిరించడం చేస్తున్నారని పేర్కొన్నారు. సభలో ఇంత జరుగుతున్నా స్పీకర్ ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు.

మంత్రులను, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి జగన్ తమపై దాడి చేయమంటూ ప్రోత్సహిస్తున్నారని లేఖలో టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అధికార బలంతో తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. అధికార పార్టీ నేతలు అసెంబ్లీ లాబీల్లో తిరుగుతూ... తమ సభ్యులను కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అరాచక చర్యలు ప్రజలకు తెలియకుండా ఉండేందుకు ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు రాజ్యాంగబద్ధంగా నడిచే విధంగా చూడాలని గవర్నర్ ను కోరారు.
Go Back to Shorts
Jagan
Tammineni Sitaram
YSRCP
Telugudesam
AP Governor
Biswabhusan Harichandan

More Telugu News