టీడీపీ సభ్యుల తీరు చూస్తుంటే స్పీకర్ ను కొడతారేమో అనిపిస్తోంది: రాపాక
- అసెంబ్లీలో వాడీవేడి వాతావరణం
- టీడీపీ సభ్యల నినాదాలు
- అసహనం వ్యక్తం చేసిన రాపాక
ఏపీ అసెంబ్లీలో అధికార, విపక్ష సభ్యుల మధ్య ఆగ్రహావేశాలు ఇవాళ కూడా కొనసాగాయి. అయితే ఆశ్చర్యకరంగా జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీ సభ్యులకు మద్దతుగా టీడీపీ శాసనసభ్యులపై ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగానికి ఉపయోగపడే రైతు భరోసా కేంద్రాల వంటి కీలక అంశంపై చర్చ జరుగుతుంటే టీడీపీ వాళ్లు చేస్తున్న అల్లరి దారుణమని పేర్కొన్నారు. తక్కువ మంది ఉన్నా భారీగా గందరగోళం సృష్టిస్తున్నారని, టీడీపీ సభ్యుల హావభావాలు, వారు చేతులు ఊపుతున్న తీరు చూస్తుంటే స్పీకర్ ను కొడతారేమో అనిపిస్తోందని అన్నారు. స్పీకర్ స్థానం పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తూ, సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని రాపాక విమర్శించారు.