పీవోకే విషయంలో సర్వసన్నద్ధంగా ఉన్నాం: ఆర్మీ చీఫ్ నరవణే

  • పీవోకే విషయంలో మా వద్ద చాలా ప్లాన్లు ఉన్నాయి
  • సరిహద్దు వెంబడి బలగాలను మోహరింపజేశాం
  • గత నాలుగేళ్లలో ఎన్నో ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించాం
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) విషయంలో చేపట్టబోయే ఆపరేషన్లకు సంబంధించి తమ వద్ద వివిధ ప్లాన్లు ఉన్నాయని నూతన ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే తెలిపారు. ఎలాంటి టాస్క్ కైనా ఆర్మీ సర్వసన్నద్ధంగా ఉందని చెప్పారు.

ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ, జమ్ముకశ్మీర్ సహా మొత్తం అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మన బలగాలను మోహరింపజేశామని తెలిపారు. పీవోకే విషయంలో ఎన్నో వ్యూహాలు ఉన్నాయని... అవసరాన్ని బట్టి వాటిని అమలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ఆదేశాలనైనా విజయవంతంగా అమలు చేసేందుకు సన్నద్ధంగా ఉన్నామని అన్నారు.

ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టే కార్యాచరణలో భాగంగా ఎలాంటి దాడులనైనా చేసే హక్కు భారత్ కు ఉందని నరవణే తెలిపారు. భారత ప్రభుత్వ నిర్ణయాలకు తగ్గట్టుగా గత నాలుగేళ్ల కాలంలో మన సైన్యం సాహసోపేతమైన ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు. 2016లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్నా ఉగ్రతండాలపై సర్జికల్ స్ట్రయిక్స్ చేశామని తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరిలో పాక్ గడ్డపై ఉన్న బాలాకోట్ లో జైషే మొహమ్మద్ స్థావరాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసిందని చెప్పారు. దేశంలోకి ఉగ్రవాదులు అక్రమంగా చొరబడకుండా గట్టి నిఘా ఉందని తెలిపారు.
Go Back to Shorts
PoK
MM Naravane

More Telugu News