ఆ మూడు దేశాల శరణార్థులకే పౌరసత్వం ఎందుకు కల్పిస్తున్నట్టు?: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్
- శ్రీలంక నుంచి వచ్చిన శరణార్థులకు ఈ చట్టం వర్తించదా?
- ఈ చట్టం వల్ల సామాజిక ఐక్యత, మత సామరస్యం దెబ్బతింటుంది
- దేశ సమైక్యత గురించి ఆలోచిస్తున్న వారంతా సీఏఏను వ్యతిరేకిస్తున్నారు
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మైనారిటీలు హింస, పీడనకు గురై భారత్ లోకి శరణార్థులుగా వచ్చినవారికే పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్రం పౌరసత్వ సవరణ చట్టంను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు దీన్ని నిరసిస్తూ.. దేశ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. మత ప్రాతిపదికన ఈ చట్టం పౌరసత్వం కల్పిస్తోందంటూ ప్రజలు, విద్యార్థులు, విపక్షాలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పవార్ స్పందించారు.
‘సీఏఏ, ఎన్నార్సీ పేరుతో దేశంలో నెలకొన్న తీవ్రమైన సమస్యల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది. పౌరసత్వ సవరణ చట్టం కింద పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలకు చెందిన శరణార్థులకు మాత్రమే పౌరసత్వం కల్పించడం ఎందుకు? శ్రీలంక నుంచి వచ్చిన శరణార్థులకు ఈ అవకాశం ఇవ్వకపోవడం వెనుక కారణం ఏమిటి?’ అని పవార్ ప్రశ్నించారు.