కథలు .. పాత్రల విషయంలో అక్కినేని నిర్మొహమాటంగా ఉండేవారట

సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ .. అక్కినేని నాగేశ్వరరావును గురించి మాట్లాడుతూ, ఆయన గురించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. "మొదటి నుంచి కూడా అక్కినేని పారితోషికం కోసం పాత్రలను అంగీకరించేవారు కాదు. తనకి నచ్చని కథలకు .. పాత్రలకు ఆయన నిర్మొహమాటంగా 'నో' చెప్పేవారు. తనకి అంతకుముందు హిట్ ఇచ్చిన దర్శకుడు గదా అని ఆ తరువాత సినిమాను ఎప్పుడూ గుడ్డిగా అంగీకరించేవారు కాదు.

అలా ఆయన వదులుకున్న సినిమాల్లో 'కన్యాశుల్కం' .. 'చిరంజీవులు' .. 'చింతామణి' .. 'వరుడు కావాలి' మొదలైనవి కనిపిస్తాయి. భరణివారి 'చింతామణి' .. 'వరుడు కావాలి' కథలకు నో చెప్పిన అక్కినేని, ఆ తరువాత వారు చేసిన 'బాటసారి'కి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తను చేసిన వాటిలో తనకి బాగా నచ్చిన చిత్రం 'బాటసారి' అని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు" అని అన్నారు.


More Telugu News