shiv sena: మహారాష్ట్ర గవర్నర్ కు అజిత్ పవార్ తప్పుడు పత్రాలు ఇచ్చారు: సంజయ్ రౌత్

బీజేపీపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఫడ్నవిస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని మహారాష్ట్ర ప్రజలకే తెలియదని అన్నారు. తమ పార్టీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ నిన్న గవర్నర్ కోష్యారీకి తప్పుడు పత్రాలు ఇచ్చారని, వాటినే గవర్నర్ అంగీకరించి ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి అవకాశమిచ్చారని చెప్పారు. 

బీజేపీ పూర్తిగా ఎమ్మెల్యేల కొనుగోలు రాజకీయం చేస్తోందని సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి స్పష్టమైన బలం ఉందని అన్నారు. కాగా, అసెంబ్లీలో బీజేపీ బలపరీక్షలో గెలవలేదని, ఆ పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యేల బలం లేదని శరద్ పవార్ తెలిపిన విషయం తెలిసిందే. బల నిరూపణ అనంతరం తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆయన కూడా ఇప్పటికే చెప్పారు.
shiv sena
BJP
Maharashtra

More Telugu News