జగన్ నిర్ణయానికి నా మద్దతు: సినీ నటుడు నారాయణమూర్తి

  • ఆంగ్ల మీడియంతోనే అందరికీ సమాన అవకాశాలు
  • భావి తరాల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకోవాలి
  • సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి
పాఠశాలల్లో ఆంగ్ల మీడియంను ప్రవేశ పెట్టాలన్న ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని తాను సమర్ధిస్తున్నానని ప్రముఖ సినీ నటుడు నారాయణమూర్తి అన్నారు. తెలుగు మీడియంలో చదివే పిల్లలు సెక్యూరిటీ గార్డులుగా, పోలీసు కానిస్టేబుళ్లుగా మారుతూ చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమితం అవుతున్నారని, ఆంగ్ల మాధ్యమంలో చదివిన వారు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారని ఆయన అన్నారు. కాకినాడ సమీపంలోని నడికుదురులో ఏర్పాటు చేసిన తాండ్ర పాపారాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వచ్చిన నారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకూ ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు రావాలన్నదే తన అభిమతమని తెలిపారు.

తనకు ఎదురవుతున్న సమస్యలు, తాను అనుభవించిన సమస్యలపైనే సినిమాలు తీస్తున్నానని నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. గతంలో తాను నిర్మించిన 'ఎర్రసైన్యం' చిత్రంలో ఇంగ్లీషు చదువులు లేక వెనుకబడిన తరగతుల వారు ఎలా నష్టపోతున్నారో చర్చించానని అన్నారు. భావి తరాల భవిష్యత్ కోసం ఆంగ్ల విద్య తప్పనిసరని నారాయణమూర్తి పేర్కొన్నారు.
Go Back to Shorts
R Narayanamurthy
Jagan
English Medium
Andhra Pradesh

More Telugu News