ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీతో చర్చిస్తున్నాం: మల్లికార్జున ఖర్గే

మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో కలిసి తాము ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'ఎన్నికలకు ముందే కాంగ్రెస్-ఎన్సీపీ పొత్తు పెట్టుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటాం. ఎన్సీపీతో చర్చలు జరుపుతున్నాం. చర్చల అనంతరమే ఏదైనా ఓ నిర్ణయంపై ముందుకు వెళతాం' అని అన్నారు.

'కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా చర్చలు జరిపారు. మరిన్ని చర్చలు జరపాల్సి ఉంది. ఓ నిర్ణయం తీసుకొని ప్రకటిస్తాం' అని మల్లికార్జున ఖర్గే చెప్పారు. కాగా, శరద్ పవార్ తో చర్చల బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ తమ సీనియర్ నేతలకు అప్పగించిన విషయం తెలిసిందే. ఆయనతో చర్చించేందుకు అహ్మద్ పటేల్, మల్లికార్జున ఖర్గే, వేణుగోపాల్.. ముంబయి వెళ్లారు.
Go Back to Shorts
mallikharjuna kharge
Congress
ncp

More Telugu News