మోదీ సర్కారుపై సంచలన విమర్శలు చేసిన రఘురామ్ రాజన్!
- ఆధిపత్య ధోరణి అభివృద్ధికి విఘాతం
- దేశాన్ని విడగొట్టే ఆలోచనలు వద్దు
- ఆర్థిక వృద్ధితోనే జాతి బలోపేతమన్న రాజన్
"ఆధిపత్యంతో జాతీయ భద్రత మరింత మెరుగుపడుతుందని నేను భావించడం లేదు. వాస్తవానికి అది జాతిని బలహీన పరుస్తుంది. వారికి కావాల్సిన విధానంలో సమగ్రత కావాలని అనుకుంటున్నారు. అది జరిగే పని కాదు" అని బ్రౌన్ యూనివర్శిటీలో భాగమైన వాట్సన్ ఇనిస్టిట్యూట్ లో ఓపీ జిందాల్ స్మారకోపన్యాసం సందర్భంగా రాజన్ వ్యాఖ్యానించారు.
ఇండియాలో ఆధిపత్య ధోరణి ఇలాగే కొనసాగితే, అది ఆర్థిక వృద్ధికి అవరోధం అవుతుందని, దేశాన్ని విభజిస్తుందని, అది భద్రతకు పెను విఘాతమని రాజన్ అభిప్రాయపడ్డారు. దేశాన్ని చీకటి కోణంలోకి నెట్టే ఇటువంటి విధానాలు తగవని హితవు పలికారు.
ఇండియాలో ఆర్థిక వృద్ధి తగ్గిపోయి, ఉత్పత్తి నుంచి వాహన రంగాల వరకూ కుదేలై, జీడీపీ అంచనాలు కుచించుకుపోయిన వేళ, రాజన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.