సంచలనాలు కాదు, వాస్తవాలు చెప్పాలి: మీడియాకు హితవు పలికిన వెంకయ్యనాయుడు
- ఒడిశా పత్రిక వందేళ్ల వేడుకలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి
- టీఆర్పీలు మీడియాను నిర్దేశించకూడదని వ్యాఖ్యలు
- వాస్తవాలు అందించే పద్ధతులు అవలంబించాలని సూచన
మీడియా సంచలనాలకు కాకుండా వాస్తవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఒడిశాలోని భువనేశ్వర్ లో 'సహజ' అనే పత్రిక వందేళ్ల వేడుకలో వెంకయ్యనాయుడు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు వాస్తవాలు అందించే పద్ధతులు అనుసరించాలని, టీఆర్పీలు, సర్క్యులేషన్ లెక్కలు మీడియాను నడిపించకూడదని అభిప్రాయపడ్డారు. ప్రజలను చైతన్య పరచడం, ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాలు నిర్మించడంలో మీడియా ప్రముఖ పాత్ర పోషించాలని అన్నారు. మీడియా నిజాయతీగా వ్యవహరించడం వల్ల ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుందని తెలిపారు.