అరబిందో ఫార్మాలో పేలిన బాయిలర్ : ఇద్దరు మృతి
అరబిందో ఫార్మా కంపెనీలో బాయిర్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరంలో ఉన్న కంపెనీలో ఈరోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. మొదటి షిప్ట్ కార్మికులు పనిలో ఉండగా హఠాత్తుగా ప్రమాదం చోటు చేసుకోవడంతో కంపెనీలో ఒక్కసారిగా భీతావహ పరిస్థితి నెలకొంది. ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా తీవ్రంగా గాయపడిన మరో కార్మికుడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులను రాహుల్, రాజారావుగా గుర్తించారు. కాగా, సన్యాసిరావు అనే వ్యక్తి గాయపడ్డాడు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.