క్రమంగా కృష్ణమ్మలో మునిగిపోతున్న సంగమేశ్వరాలయం!
- శ్రీశైలానికి స్థిరంగా వరద
- 2.27 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
- 858 అడుగులకు చేరిన నీటిమట్టం
కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉండటంతో ఇదే వరద మరో నాలుగైదు రోజులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 50 టీఎంసీలకు పైగా నీరు చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, మరింతకాలం వర్షాలు పడితే, నీరు నాగార్జునసాగర్ కు కూడా విడుదల చేయవచ్చని తెలిపారు.
కాగా, శ్రీశైలానికి వస్తున్న నీటితో సంగమేశ్వరాలయం పూర్తిగా మునిగి, పై గోపురం మాత్రమే దర్శనమిస్తోంది. దీంతో ఆలయ పురోహితులు, ఆదివారం ఆలయ శిఖరంపై ప్రత్యేక పూజలు నిర్వహించి సంగమేశ్వరుడికి వీడ్కోలు పలికారు. జలాశయంలో నీటిమట్టం మరో రెండు అడుగులు పెరిగి 860 అడుగులకు చేరితే, ఆలయం పూర్తిగా నీటమునుగుతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఆలయం మునిగే వేళ, పిల్లి, సర్పం, శునకం కనిపించాయని, వాటిని కాపాడి, ఎగువన ఉన్న పుష్కర ఘాట్ వద్ద వదిలి పెట్టామని ఆలయ పురోహితులు వెల్లడించారు.