విశాఖ చేరుకున్న ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక తొలి అధికారిక పర్యటనకు శ్రీకారం చుట్టిన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ విశాఖ నగరానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. ఆయన రెండు రోజులపాటు నగరంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్‌కు జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ మీనా, నేవీ అధికారులు ఘనస్వాగతం పలికారు.

అనంతరం ఆయన రోడ్డు మార్గంలో ఈస్ట్రన్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్ట్స్‌కు చేరుకున్నారు. అక్కడ రియర్ అడ్మిరల్ సంజయ్ దత్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఐఎన్ఎస్ డేగకు చేరుకుని యుద్ధ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలను బయట నుంచే తిలకించారు. తర్వాత నేవీ అధికారులతో చర్చించారు. సాయంత్రం కైలాసగిరిపై ఉన్న తెలుగు మ్యూజియం, నగరం నడిబొడ్డున ద్వారకానగర్‌లో ఉన్న వైఎస్సార్‌ సెంట్రల్‌ పార్క్‌ను సందర్శిస్తారు. రేపు చారిత్రక ఆంధ్ర విశ్వవిద్యాలయం, పోర్టులో జరిగే కార్యక్రమాల్లో గవర్నర్‌ పాల్గొంటారు.


More Telugu News