18 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు.. చంద్రబాబు త్వరలో జైలుకే!: బీజేపీ నేత సునీల్ దేవ్ ధర్ సంచలన వ్యాఖ్యలు

  • చంద్రబాబు, మంత్రులు తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారు
  • మునిగిపోతున్న నావ నుంచి వారు బయటపడాలనుకుంటున్నారు 
  • ఐఏఎన్ఎస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ జాతీయ కార్యదర్శి
బీజేపీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల కో-ఇన్ చార్జ్ సునీల్ దేవ్ ధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తం 23 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో 18 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలోనే జైలుకు వెళతారని జోస్యం చెప్పారు. చంద్రబాబుతో పాటు అప్పటి పలువురు మంత్రులు, అనుచరులు తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. దీంతో పార్టీ ఇమేజ్ బాగా దెబ్బతిందని, ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు గ్రహించారు కాబట్టే, మునిగిపోతున్న నావ లోంచి బయటపడడానికి తమను సంప్రదిస్తున్నారని పేర్కొన్నారు.

ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ కు ఈరోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవ్ ధర్ ఈ మేరకు మాట్లాడారు. ప్రస్తుతం ఏపీలోని ఒక్కో లోక్ సభ నియోజకవర్గంలో లక్ష మంది కొత్త సభ్యులను బీజేపీలోకి చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ముఖ్యంగా పేద ప్రజలకు దగ్గర అయ్యేందుకు తాము కృషి చేస్తున్నామని అన్నారు. టీడీపీకి ఏపీలో భవిష్యత్ లేదని దేవ్ ధర్ పునరుద్ఘాటించారు. చంద్రబాబు మెడపై అరెస్టు కత్తి వేలాడుతోందనీ, ఏ క్షణమైనా ఆయన కటకటాల వెనక్కు వెళతారని పేర్కొన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Telugudesam
BJP
sunil
18 out of 23 mlas
IANS

More Telugu News