ఏపీ ఎన్నికల్లో అందుకే ఓడిపోయాం.. ఇంకా భ్రమల్లో ఉంటే టీడీపీ నిలబడదు!: అశోక్ గజపతిరాజు హెచ్చరిక

  • నలుగురు టీడీపీ ఎంపీల ఫిరాయింపులు
  • ఓడిపోయాం కాబట్టే పోతున్నారన్న టీడీపీ నేత
  • జగన్ నీతి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా
టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్, టీజీ వెంకటేశ్ నిన్న బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులపై టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది కాబట్టే కొందరు నేతలు పార్టీని వీడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి నుంచి నూతన నాయకత్వాన్ని తయారుచేసుకోవాల్సిన అవసరం ఉందని అబిప్రాయపడ్డారు. ఈరోజు విజయనగరం జిల్లాలో మీడియాతో అశోక్ గజపతి రాజు మాట్లాడారు.

ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై అశోక్ గజపతిరాజు సునిశిత విమర్శలు చేశారు. ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ప్రజంటేషన్ కూడా ముఖ్యమేనని తెలిపారు. అయితే ఈ రెండింటి మధ్య గ్యాప్ వచ్చిందనీ, అందువల్లే టీడీపీ ఓడిపోయిందని విశ్లేషించారు.

ఇప్పటికీ టీడీపీ బలంగానే ఉందనీ, తప్పులు తెలుసుకుని పార్టీని బలోపేతం చేయడంపై చంద్రబాబు దృష్టి సారించాలని సూచించారు. అలా కాకుండా ఇంకా ఏదో భ్రమలో ఉండిపోతే నాయకత్వం నిలబడదు అని హెచ్చరించారు. ఏపీ సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఓమాట, ఎన్నికల తర్వాత మరోమాట చెబుతున్నారని విమర్శించారు. జగన్ లాంటి వ్యక్తులు నీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Telugudesam
ashok gajapati raju
warning
Jagan
YSRCP

More Telugu News