జగన్ కు ఆ సమర్థత ఉంది: లక్ష్మీపార్వతి
- అందరినీ మెప్పించే సుపరిపాలన అందిస్తారు
- తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటారు
- గుంటూరు జిల్లాలో మీడియాతో మాట్లాడిన లక్ష్మీపార్వతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జగన్ పై వైసీపీ మహిళా నేత నందమూరి లక్ష్మీపార్వతి ప్రశంసల వర్షం కురిపించారు. దివంగత వైఎస్సార్ ను మరిపించేలా జగన్ సుపరిపాలన అందించడం ఖాయమని అన్నారు. వైఎస్సార్ వారసుడిగా జగన్ కు ఆ సమర్థత ఉందని, అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటారని అభిప్రాయపడ్డారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు జగన్ పేర్కొన్న నవరత్నాలకు విపరీతంగా ఆకర్షితులయ్యారని, అవే వైసీపీని గెలిపించాయని విశ్లేషించారు. ఎవరూ ఊహించని స్థాయిలో రాష్ట్రంలో వైసీపీ అఖండవిజయం సాధించిందని లక్ష్మీపార్వతి తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లూరులో వైసీపీ నేత ఘంటా శివరంగారావు నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.