126 నుంచి 130 సీట్లు కచ్చితంగా గెలుస్తాం: ఎమ్మెల్యే రోజా
- 22 నుంచి 23 ఎంపీ స్థానాల్లో వైసీపీ గెలవబోతోంది
- వైఎస్ జగన్ సీఎం కాబోతున్నారు
- ఎగ్జిట్ పోల్స్ చూసి కాదు ప్రజల నాడి చూసి చెబుతున్నా
ఈ నెల 23న ఎన్నికల ఫలితాల కోసం ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ప్రజలు కోరుకున్న విధంగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని, 126 నుంచి 130 సీట్లు కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, 22 నుంచి 23 ఎంపీ స్థానాల్లో వైసీపీ గెలవబోతోందని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా కాదు ఆంధ్ర ప్రజల నాడి చూసి తమ గెలుపు ఖాయమని చెబుతున్నానని చెప్పారు. ఎన్నో అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసి, ఎన్నో అన్యాయాలను బయటపెట్టిన ప్రతిపక్షనాయకుడు జగన్ అని అన్నారు. తన పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై, వారి కష్టనష్టాల గురించి జగన్ తెలుసుకున్నారని అన్నారు. అందుకే, వైసీపీ అధికారంలోకి రాగానే ‘నవరత్నాలు’ అమలు చేస్తామని చెప్పారు.