లక్నోలో మాయావతితో ముగిసిన చంద్రబాబు భేటీ

దేశ రాజకీయాల్లో మోదీకి వ్యతిరేకంగా బలమైన కూటమిని తయారుచేయడమే లక్ష్యంగా పరిశ్రమిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇవాళ క్షణం తీరికలేకుండా గడిపారు. ఎన్డీయేతర పార్టీలను ఒకేతాటిపైకి నిలపడమే ప్రధాన ఉద్దేశంగా కృషి చేస్తున్న ఆయన లక్నోలో అఖిలేశ్ యాదవ్, మాయవతి వంటి ముఖ్యనేతలతో విడివిడిగా సమావేశం అయ్యారు. ఈ ఉదయం ఢిల్లీలో శరద్ పవార్ వంటి పలువురు అగ్రనేతలతో మాట్లాడిన చంద్రబాబు, ఆపై లక్నో వెళ్లి అఖిలేశ్ యాదవ్ ను కలిశారు. అనంతరం, మాయావతిని కలిసి సుదీర్ఘ సమయంపాటు చర్చించారు.

భేటీకి ముందు ఆమెకు చంద్రబాబు పలు కానుకలు అందించారు. కాగా, ఎన్నికల ఫలితాల అనంతరం ప్రాంతీయ పార్టీలను బీజేపీ దరిచేరనీయకుండా నిలువరించడమే ప్రధాన అజెండాగా చంద్రబాబు సమాలోచనలు జరిపినట్టు తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా, ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో ఆ పార్టీకి ఇతర పార్టీల మద్దతు దక్కకుండా చేయడంపై ప్రస్తుతం చంద్రబాబు మంత్రాంగం సాగిస్తున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Chandrababu

More Telugu News