ఏప్రిల్ 22 వరకు భగభగే.. తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక

Telangana Weather Update Heatwave Warning Issued Until April 22
తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతోందని, రానున్న పది రోజుల పాటు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏప్రిల్ 22వ తేదీ వరకు పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ముఖ్యంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు చేరవచ్చని అంచనా వేసింది.

గత వారం రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రతకు తోడు వేడి, ఉక్కపోత అధికంగా ఉండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శుక్రవారం నాటికే రాష్ట్రంలోని 27 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నల్గొండ జిల్లా ఘనపూర్‌లో అత్యధికంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆకాశంలో మేఘాలు కనిపించినా వాతావరణంలో చల్లదనం ఉండదని, వేడిగాలులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

రాజధాని హైదరాబాద్‌లోనూ రానున్న రోజుల్లో 40 నుంచి 41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కీలక సూచనలు చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని హితవు పలికింది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, చిన్నారుల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని సూచించింది. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే వడదెబ్బ తగలకుండా తలపాగా, గొడుగు వంటివి వాడాలని, తరచూ నీరు, ద్రవ పదార్థాలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
Go Back to Shorts
Telangana Weather
Hyderabad Weather
Heatwave
Weather Forecast
IMD
Telangana
Temperature
Heatwave alert
Summer
April 22

More Telugu News