నా ఉద్దేశం వేరు.. అప్పుడా పదం స్ఫురించలేదు: శ్యాం పిట్రోడా

  • హిందీలో తాను చాలా వీక్
  • ఆ సమయంలో ‘బురా’ అనే పదం స్ఫురించలేదు
  • వివరణ ఇచ్చిన కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్
సిక్కుల ఊచకోతపై తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో కాంగ్రెస్  ఓవర్సీస్ చీఫ్ శ్యాం పిట్రోడా స్పందించారు. తన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారని, తన ఉద్దేశం వేరని అన్నారు. తనకొచ్చిన హిందీ అంతంత మాత్రమే కావడంతో పొరపాటు జరిగిందని పేర్కొన్నారు. జరిగిన చెడు ఏదో జరిగిందని (జో హువా వో బురా హువా) అని చెప్పాలనుకున్నానని, అయితే, ఆ సమయంలో బురా (చెడు) అనే పదం స్ఫురించకపోవడంతో తను చెప్పాలనుకున్నది.. ‘జరిగిందేదో జరిగింది.. అయితే ఏంటి?’ అని మారిపోయిందన్నారు. తనకు హిందీపై అంతగా పట్టులేకపోవడమే ఈ పొరపాటుకు కారణమన్నారు.

పిట్రోడా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు పిట్రోడాపై విరుచుకుపడ్డారు. సిక్కుల ఊచకోతపై కాంగ్రెస్‌కు ఎటువంటి పశ్చాత్తాపమూ లేదని అన్నారు. మరోవైపు, పిట్రోడా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నష్టనివారణ చర్యలు ప్రారంభించింది.  పిట్రోడా వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పేర్కొంది. హింస, అల్లర్లకు సమాజంలో తావు లేదని స్పష్టం చేసింది. సిక్కుల ఊచకోతతో పాటు, గుజరాత్‌ అల్లర్లకు కారణమైన వారికి శిక్షపడి, బాధితులకు న్యాయం జరిగే వరకు తాము పోరాడుతూనే ఉంటామని పేర్కొంది.
Go Back to Shorts
sam pitroda
Congress
Sikh riots
BJP

More Telugu News