ఎండలకు తట్టుకోలేకపోతున్న చిన్నారులు.. లక్నోలో పాఠశాలల పని గంటల తగ్గింపు!

  • లక్నోలో మండుతున్న ఎండలు
  • 10వ తరగతి వరకు ఉదయం 7.30 నుంచి 12 గంటల వరకు పాఠశాలలు
  • ఇంటర్మీడియట్ కు మధ్యాహ్నం 1 గంట వరకు పని గంటలు
మండుతున్న ఎండల నేపథ్యంలో, చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్ లోని లక్నో జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలో ఎండల తీవ్రత అంతకంతకూ పెరుగుతుండటంతో... జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పని గంటలను తగ్గించాలని ఆయన ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం... ఏప్రిల్ 30వ తేదీ నుంచి 10వ తరగతి వరకు ఉన్న అన్ని పాఠశాలలు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పని చేయాలి. ఇంటర్మీడియట్ కళాశాలలు 1 గంట వరకు పని చేయాలి. లక్నోలో నిన్నటి పగటి ఉష్ణోగ్రత 42.7 డిగ్రీల సెల్సియస్ గా నమోదయింది. ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీలను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ ఆదేశాలను జారీ చేశారు.

మరోవైపు, వాతావరణ శాఖ ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. అనవసరంగా ఎండలో తిరగొద్దని, పలుచటి వస్త్రాలను మాత్రమే ధరించాలని, లేత రంగులున్న దుస్తులు మాత్రమే ధరించాలని, బిగుతుగా ఉన్న వస్త్రాలు కాకుండా లూజుగా ఉన్న దుస్తులు ధరించాలని, కాటన్ దుస్తులను ధరించాలని, తలను వస్త్రంతో కప్పుకోవడం కానీ లేదా గొడుగు, టోపీ ఉపయోగించాలని సూచించింది. సాధ్యమైనంతగా మంచి నీటిని తాగాలని చెప్పింది.  
Go Back to Shorts
students
heat
schools
lucknow
timings

More Telugu News