చంద్రబాబుకు సాంకేతిక సలహాదారు హోదాలోనే హరిప్రసాద్ వచ్చారు!: ఈసీకి టీడీపీ నేత కనకమేడల లేఖ

  • గతంలో ఈసీకి మేం చాలా లేఖలు రాశాం
  • హరిప్రసాద్ రాకపై ఈసీ అభ్యంతరం లేవనెత్తడంపై ఆగ్రహం
  • ఈవీఎంల్లో లోపాలను హరిప్రసాదే గుర్తించారన్న కనకమేడల
టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి లేఖ రాశారు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఈసీకి తాము చాలా లేఖలు రాశామని కనకమేడల తెలిపారు. మొదటిసారి ఈసీ నుంచి లేఖ వచ్చిందని వ్యాఖ్యానించారు. హరిప్రసాద్ విషయంలో ఈసీ అభ్యంతరాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఈవీఎంలలో భద్రతాలోపాలను హరిప్రసాదే గుర్తించారని కనకమేడల లేఖలో ప్రస్తావించారు.

ఈ విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. ఈవీఎంల పనితీరును అమెరికా, నెదర్లాండ్స్ పరిశోధకులతో కలిసి ఆయన అధ్యయనం చేశారన్నారు. ఏపీ సీఎంకు సాంకేతిక సలహాదారు హోదాలోనే హరిప్రసాద్ ముందుకు వచ్చారని కనకమేడల స్పష్టం చేశారు. ఓ సాంకేతిక నిపుణుడు అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందని తేల్చిచెప్పారు. ఈవీఎంలపై రేపు ఈసీ సాంకేతిక కమిటీతో చర్చించే అవకాశం కల్పించాలని కోరారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Telugudesam
kanakamedala
hariprasad
letter
ec

More Telugu News