Pranab Mukherjee: అలాంటి సాహసకృత్యాలతో మెప్పు పొందలేరు!: ఎన్నికల వేళ ప్రణబ్ ముఖర్జీ కీలక వ్యాఖ్యలు

  • సాహసాలు చేసి ప్రజల మెప్పు పొందాలనుకోవడం పొరపాటు
  •  ప్రజల కోసంపనిచేసే వారినే జాతి కోరుకుంటుంది
  • ఏఐఎంఏ మేనేజింగ్ ఇండియా అవార్డ్స్ కార్యక్రమంలో ప్రణబ్
అవాస్తవిక సాహస కృత్యాల ద్వారా ప్రజల మెప్పును పొందాలనుకుంటే అది అయ్యే పని కాదని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం పనిచేసే వారిని, వారి ఆశలకు, అంచనాలకు దగ్గరగా పాలించే వారినే జాతి కోరుకుంటుందని ఆయన అన్నారు.

 ఏఐఎంఏ మేనేజింగ్ ఇండియా అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణబ్ ప్రసంగిస్తూ, సాహసకృత్యాలు దేశాన్ని ముందుకు నడిపించలేవని, దేశ ప్రజలందరూ కోరుకునే సంక్షేమ పాలనను దగ్గర చేయగలిగేవారే దేశానికి కావాలని అన్నారు. పేదరికాన్ని పారద్రోలడానికి ఇంకా చాలా సంవత్సరాలే పట్టవచ్చని అంచనా వేశారు.

ఇండియాలోని 60 శాతం సంపద కేవలం ఒక్క శాతం ప్రజల వద్ద ఉండిపోయిందని, పేదరికాన్ని తరిమేసేందుకు కార్పొరేట్ సంస్థలు తమ వంతు సహాయ సహకారాలను అందించాలని అన్నారు. ఇండియాలో ధనిక, పేద తరగతుల మధ్య ఆంతర్యం చాలా అధికమని, ఈ గణాంకాలు దేశ వృద్ధికి విఘాతమని ప్రణబ్ ముఖర్జీ అంచనా వేశారు.
Pranab Mukherjee
AIMA
quixotic heroism
India

More Telugu News