ట్రంప్ పాల్గొన్న విందులో కాల్పులు.. అదే హోటల్‌లో కేఏ పాల్.. ఆయ‌న‌ ఏమ‌న్నారంటే..!

Donald Trump Event Interrupted by Shooting KA Paul Reacts
  • వాషింగ్టన్‌లో ట్రంప్ పాల్గొన్న విందు వద్ద కాల్పుల కలకలం
  • దుండగుడిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది
  • సంఘటన జరిగిన హోటల్‌లోనే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
  • వీడియో సందేశం ద్వారా వివరాలు వెల్లడించిన పాల్
  • ప్రపంచంలో శాంతి కరువైందని ఆవేదన వ్యక్తం చేసిన కేఏ పాల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఓ కార్యక్రమం వద్ద కాల్పులు జరగడం కలకలం రేపింది. వాషింగ్టన్ డీసీలోని హిల్టన్ హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అదే సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఆ హోటల్‌లోనే ఉండటం గమనార్హం.

వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వార్షిక విందు సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఓ వ్యక్తి తుపాకీతో హోటల్‌లోకి ప్రవేశించి, విందు జరుగుతున్న హాల్ బయట కాల్పులకు తెగబడ్డాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

ఈ ఘటన జరిగిన సమయంలో తాను కూడా అక్కడే ఉన్నానని కేఏ పాల్ స్వయంగా వెల్లడించారు. హిల్టన్ హోటల్ నుంచే ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. "గంట, రెండు గంటల క్రితం అధ్యక్షుడు ట్రంప్‌పై ఓ షూటర్ దాడికి ప్రయత్నించాడు. ఇక్కడ చాలా సెక్యూరిటీ ఉంటుంది. లోపలికి రావాలంటే చాలా చెకింగ్స్ ఉంటాయి. అలాంటిది అధ్యక్షుడు లోపల ఉండగా షూటర్ ఎలా వచ్చాడు?" అని పాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని తెలిపారు. ప్రపంచంలో శాంతి కరవైందని, యుద్ధాలు పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Go Back to Shorts
KA Paul
Donald Trump
Washington DC
Hilton Hotel shooting
White House Correspondents Association
Gun violence
US President
Peace Party
Political event

More Telugu News