Bengaluru: బెంగళూరులో రాత్రికి రాత్రే మాయమైన వందేళ్లనాటి మర్రిచెట్టు!

  • శతాబ్దం చరిత్ర కలిగిన మర్రి చెట్టును నరికేసిన దుండగులు
  • గురువారం రాత్రి కనిపించిన చెట్టు శుక్రవారం ఉదయం మాయం
  • చెట్టు మాయంపై భిన్న కథనాలు
బెంగళూరులో విచిత్రంగా రాత్రికి రాత్రే వందేళ్ల చరిత్ర కలిగిన ఓ మర్రిచెట్టు మాయమైంది. ఇప్పుడీ ఘటన స్థానికంగా సంచలనమైంది. నగరంలోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న శతాబ్దం వయసున్న మర్రిచెట్టును రాత్రికి రాత్రే ఎవరో తొలగించారంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం సాయంత్రం కనిపించిన అతిపెద్ద మర్రిచెట్టు శుక్రవారం ఉదయం కనిపించకపోవడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. రాత్రికి రాత్రే అంత పెద్ద చెట్టు ఎలా మాయమైందో తెలియక తలలుపట్టుకున్నారు.

చెట్టు మాయమవడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు కావాలనే దానిని నరికివేశారని చెబుతుండగా, అటవీ అధికారులే చెట్టును నరికేసి తరలించారని మరికొందరు ఆరోపిస్తున్నారు. సమీపంలో ఉన్న షాప్ కీపర్ పనేనని ఇంకొందరు అనుమానిస్తున్నారు. ఓ సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
Bengaluru
banyan tree
missing
overnight
100-year-old

More Telugu News