జనసేన స్క్రీనింగ్ కమిటీకి బయోడేటా అందజేసిన ఏపీ డిప్యూటీ సీఎం సోదరుడు

వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థుల బయోడేటాల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీకి ఈ ఒక్క రోజే  220 బయోడేటాలు సమర్పించారు. ఏపీ డిప్యూటీ సీఎం చిన రాజప్ప సోదరుడు నిమ్మకాయల లక్ష్మణమూర్తి (బాపూజీ) తమ బ‌యోడేటాను స‌మర్పించారు. పెద్దాపురం అసెంబ్లీ స్థానం నుంచి లక్ష్మ‌ణ‌మూర్తి టికెట్ ఆశిస్తున్నారు. కాగా, తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి ‘జనసేన’ తొలి అభ్యర్థిగా పితాని బాలకృష్ణ పేరును పవన్ కల్యాణ్ ఆమధ్య ప్రకటించడం తెలిసిందే. పితాని బాలకృష్ణ కూడా ఈరోజు తన బయోడేటాను స్క్రీనింగ్ కమిటీకి సమర్పించారు. ఇంకా బ‌యోడేటాలు స‌మ‌ర్పించిన వారిలో వైద్యులు, విశ్రాంత ఉద్యోగులు, యువ‌కులు, మ‌హిళ‌లు ఉన్నారు. ఇవాళ ఒక్క రోజే సుమారు 10 మంది వైద్యులు జ‌న‌సేన అభ్య‌ర్ధిత్వం కోరుతూ బ‌యోడేటాలు స‌మ‌ర్పించారు. వీరంతా త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ కార్య‌క‌లాపాల్లో క్రియాశీల‌కంగా ఉన్నట్టు ‘జనసేన’ ఓ ప్రకటనలో తెలిపింది.


More Telugu News