కొన్ని శక్తులు నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయ్.. అర్ధరాత్రి చెప్పకుండా లోకేశ్ టూర్ ను క్యాన్సిల్ చేసేశారు!: ఆమంచి ఆగ్రహం

  • వైసీపీ నేతలతో 10 రోజులుగా చర్చిస్తున్నా
  • తోట త్రిమూర్తులతో కులపరమైన చర్చలు జరిపా
  • ఏపీ సీఎంతో భేటీ అయిన ఆమంచి కృష్ణమోహన్
వైసీపీ నేతలతో గత 10 రోజులుగా చర్చలు జరుపుతున్న మాట వాస్తవమేనని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. తోట త్రిమూర్తులతో రాజకీయ-కులపరమైన చర్చలు జరిపానని ఆయన అంగీకరించారు. ప్రకాశం జిల్లాలో తనకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని ఆరోపించారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఈరోజు కలుసుకున్న అనంతరం ఆయన ఓ మీడియా ఛానల్ తో మాట్లాడారు.

తాను వైసీపీ అధినేత జగన్ ను ఇంతవరకూ కలుసుకోలేదని స్పష్టం చేశారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో ఓ కార్యక్రమం సందర్భంగా మంత్రి లోకేశ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించామన్నారు. అయితే కొందరు సొంత పార్టీ నేతలు అర్ధరాత్రి ఈ కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేయించారని మండిపడ్డారు. మంత్రి పర్యటన నేపథ్యంలో పేపర్, టీవీల్లో ప్రకటనలు కూడా ఇచ్చామనీ, ప్రజలు భారీగా తరలివచ్చారని గుర్తుచేశారు.

ఎమ్మెల్యేగా ఉన్న తనకు చెప్పకుండా ఈ కార్యక్రమాన్ని రద్దు చేయించారని, తాను ఏమన్నా పాకిస్థాన్ లో ఉన్నానా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా కొన్ని శక్తులు ప్రకాశం జిల్లాలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని పునరుద్ఘాటించారు. ఈ విషయాలన్నీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాననీ, తన అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
Telugudesam
Prakasam District
Nara Lokesh
Jagan
amanchi krishna mohan
tour cancel

More Telugu News