కరెంట్ షాక్ కొట్టడంతో.. పెళ్లయిన నాలుగు రోజులకే ప్రాణాలు కోల్పోయిన నవవధువు!

  • పొరపాటున హీటర్ ను పట్టుకున్న యువతి
  • స్విచ్ఛాఫ్ చేయకపోవడంతో విద్యుత్ ప్రసారం
  • విషాదంలో మునిగిపోయిన ఇరు కుటుంబాలు
విద్యుత్ హీటర్ విషయంలో అజాగ్రత్తగా వ్యవహరించిన ఓ యువతి పెళ్లయిన నాలుగు రోజులకే ప్రాణాలను కోల్పోయింది. ఈ హృదయవిదారక ఘటన తెలంగాణలోని సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది. నగరంలోని జనరల్ బజార్ లో ఉంటున్న మనీషాకు ఈ నెల 22న వివాహం అయింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులను కలుసుకునేందుకు మనీషా నిన్న పుట్టింటికి వచ్చింది. స్నానం చేద్దామని వాటర్ హీటర్ ను ఆన్ చేసి నీళ్ల బకెట్ లో పెట్టింది.

కొద్దిసేపటి తర్వాత నీళ్లు వేడిగా అయ్యుంటాయని భావించిన మనీషా హీటర్ ను బయటకు తీయబోయింది. అయితే తడిగా ఉన్న హీటర్ మనీషాకు తగలడం, స్విచ్ ఆఫ్ చేయకపోవడంతో ఒక్కసారిగా విద్యుత్ ప్రసారం జరిగింది. దీంతో బాధితురాలు అక్కడికక్కడే గిలగిలా కొట్టుకుని ప్రాణాలు విడిచింది.

ఆమె అరుపులు విన్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆమె మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మనీషా మృతితో ఆమె తల్లిదండ్రులతో పాటు అత్తారింటివారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Go Back to Shorts
Telangana
secundrabad
bride dead
current shock
electricity shock
Police
case registered

More Telugu News