టీచర్ పోస్టులను ఫిబ్రవరిలోగా భర్తీ చేయండి.. ఏపీ, తెలంగాణకు సుప్రీంకోర్టు ఆదేశం!

  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇద్దరు వ్యక్తులు
  • ఆదేశాలు అమలుకావడం లేదంటూ పిటిషన్
  • ఏపీలో డీఎస్సీ జరుగుతోందన్న న్యాయవాది
తెలుగు రాష్ట్రాల్లో టీచర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఇరు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలోగా టీచర్ల ఖాళీలను భర్తీ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఉపాధ్యాయ నియామకాల్లో ఆలస్యం జరుగుతోందనీ, సుప్రీం ఆదేశాలు అమలుకావడం లేదంటూ జేకే రాజు, వెంకటేశ్‌ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.

ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. తెలంగాణలో నియామక ప్రక్రియ పూర్తయినప్పటికీ ఇంకా పోస్టింగులు మాత్రం ఇవ్వలేదని తెలిపారు. హైకోర్టులో ఉన్న పెండింగ్ కేసుల కారణంగా కొన్ని పోస్టులకు ఇంకా ఫలితాలను ప్రకటించలేదన్నారు. ఈ సందర్భంగా ఏపీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. తమ రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు జరుగుతున్నాయనీ, ఫిబ్రవరి చివరికల్లా నియామక ప్రక్రియను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది.
Go Back to Shorts
Andhra Pradesh
Telangana
dsc
teachers
recruitment
Supreme Court
order
febrauary
filling

More Telugu News