మేం చేతులు ముడుచుకొని కూర్చోం.. కేసీఆర్ కు అంతకంటే పెద్ద గిఫ్ట్ ఇస్తాం!: బుద్ధా వెంకన్న
- మోదీ డైరెక్షన్ లో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్
- కేసుల మాఫీ కోసమే జగన్ ప్రయత్నాలు
- జగన్ కేసీఆర్ తో లాలూచీ పడ్డారు
రిటర్న్ గిఫ్ట్ పేరుతో కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు హడావుడి చేస్తున్నారని వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశరాజకీయాలను ప్రభావితం చేయగలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడని వ్యాఖ్యానించారు. జగన్ తెలంగాణలో పోటీ చేయకుండా కేసీఆర్ తో లాలూచీ పడ్డారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా అక్కర్లేదని కేసీఆర్, హరీశ్ రావు గతంలో అన్నారని గుర్తుచేశారు.
ఇప్పుడు జగన్ వారితో కలవడం ద్వారా ఏపీకి ప్రత్యేకహోదా అవసరం లేదన్న సందేశాన్ని ప్రజలకు ఇస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటే ఇక్కడ ఎవరూ చేతులు ముడుచుకుని కూర్చోలేదని వెంకన్న స్పష్టం చేశారు. తాము అంతకంటే పెద్ద గిఫ్టును 2019లో కేసీఆర్ కు ఇస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు వైసీపీ అధినేత జగన్ ను ఆయన నివాసంలో కలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై కేటీఆర్ జగన్ తో చర్చించనున్నట్లు తెలుస్తోంది.