అనుచరులతో మాట్లాడుతూ, కన్నీటిపర్యంతమైన మాజీ స్పీకర్ మధుసూదనాచారి!

  • తెలంగాణ తొలి స్పీకర్ గా గుర్తింపు
  • తాజా ఎన్నికల్లో ఓటమిపాలు 
  • కొందరు నమ్మకద్రోహం చేశారని ఆరోపణలు
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించినప్పటికీ, తెలంగాణ రాష్ట్రానికి తొలి స్పీకర్ గా పనిచేసిన మధుసూదనాచారి అపజయం పాలైన సంగతి తెలిసిందే. తాజాగా భూపాలపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్న ఆయన, మనస్తాపంతో కంటతడిపెడుతుంటే, చుట్టూ ఉన్న నేతలు, కార్యకర్తలు ఉద్వేగానికి లోనయ్యారు. మహిళలైతే బోరున విలపించారు.

ఈ ఓటమితో తానేమీ పెద్దగా బాధపడటం లేదని, అయితే, ఎంతో కష్టపడి తాను తీసుకొచ్చిన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ముక్కలవుతుందని వస్తున్న వార్తలు వినడంతోనే తన గుండె ముక్కలైందని ఆయన కన్నీరు పెట్టారు. ఓటమి తన మనసును కలచివేసిందన్న ఆవేదనను వ్యక్తం చేసిన ఆయన, జిల్లాను మిగతా 31 జిల్లాలకన్నా మిన్నగా అభివృద్ధి చేయాలని భావించానని అన్నారు. పార్టీలో ఉన్న కొందరు తనకు నమ్మక ద్రోహం చేశారని ఆరోపించిన ఆయన, త్వరలో జరిగే పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు గెలిచేలా కృషి చేయాలని అన్నారు.
Go Back to Shorts
Telangana
First Speaker
Madhusudhana Chari

More Telugu News