చంద్రబాబు ప్రచారం ఖర్చులో సగం డబ్బులు కేటాయించినా ఈపాటికి పోలవరం పూర్తయిపోయేది!: భూమన సెటైర్లు

  • జగన్ హోదా కోసం కలిసివస్తామన్నారు
  • సంజీవనా? అంటూ చంద్రబాబు ఎకసెక్కాలాడారు
  • గేట్లు బిగించడానికి ఇంత ఖర్చా?
ప్రత్యేకహోదాపై ఎవరితో అయినా కలిసి పనిచేస్తామని ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మొదట్లోనే ప్రకటించారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ప్రత్యేకహోదా ఏమైనా సంజీవనా? అంటూ వెటకారంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తి ఈ రోజు హోదా విషయంలో సొంత మీడియా సాయంతో టముకు వాయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హోదా-విభజన హామీలపై బాబు విడుదల చేసే శ్వేతపత్రాలను ఎవ్వరూ నమ్మరని స్పష్టం చేశారు. ప్రజలు అమాయకులు అని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని దుయ్యబట్టారు.

సోషల్ మీడియాలో చంద్రబాబు వ్యవహారశైలిని ప్రజలు ఏకిపారేస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రచారానికి చేసుకుంటున్న ఖర్చులో సగం డబ్బు పెడితే ఈపాటికి పోలవరం ఎప్పుడో పూర్తయిపోయేదని ఎద్దేవా చేశారు. ప్రపంచంలో ఏ నేతా ప్రాజెక్టు గేట్లు ఎత్తడానికి, బిగించడానికి అట్టహాసంగా కార్యక్రమాలు చేయరని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఏపీ ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Telugudesam
polavaram
YSRCP
Jagan
bhumana
karunakar reddy

More Telugu News