BJP Rathyatra: బీజేపీకి షాక్.. పశ్చిమ బెంగాల్‌లో రథయాత్రకు హైకోర్టు బ్రేక్‌!

  • సింగిల్‌ జడ్జి తీర్పును రద్దు చేసిన ధర్మాసనం
  • రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన పట్టించుకోలేదని వ్యాఖ్య 
  • నిఘావర్గాల సమాచారం చూడాల్సిందని సూచన 
సార్వత్రిక ఎన్నికల్లో కనీసం సగం స్థానాలు సాధించాలన్న లక్ష్యంతో పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో బీజేపీ తలపెట్టిన రథయాత్రకు మళ్లీ బ్రేక్‌ పడింది. రథయాత్రకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ కలకత్తా హైకోర్టులోని సింగిల్‌ జడ్జి తపాబ్రాత చక్రవర్తి తీర్పు ఇచ్చి ఒక రోజు కూడా గడవక ముందే ఆ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. రథయాత్ర కారణంగా శాంతిభద్రతల అంశంపై ఎదురయ్యే పరిణామాలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిఘా సంస్థలు ఇచ్చిన నివేదికను న్యాయమూర్తి పరిగణలోకి తీసుకుని మళ్లీ ప్రారంభం నుంచి కేసు విచారించాలని ధర్మాసనం ఆదేశించింది.

యాత్రకు మమతాబెనర్జీ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో బీజేపీ కోర్టును ఆశ్రయించింది. గురువారం సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు అనుకూలంగా రావడంతో ఉత్సాహంగా వున్న బీజేపీ శ్రేణులు శనివారం భీర్‌భూమ్‌ జిల్లాలో తొలివిడత రథయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. వారి ఆనందంపై కోర్టు నీళ్లు చల్లింది. కాగా, ఈ వివాదంపై ఇప్పట్లో కోర్టు నిర్ణయం వచ్చేలా కనిపించడం లేదు. కలకత్తా హైకోర్టుకు శీతాకాలం సెలవులు ప్రారంభమయ్యాయి. అందువల్ల వివాదం వెకేషన్‌ బెంచికి వెళితే తప్ప జనవరి మొదటి వారంలోగా నిర్ణయం వెలువడే అవకాశం లేదు.
BJP Rathyatra
West Bengal
high court break

More Telugu News