Andhra Pradesh: అమరావతి అయిపోయింది.. ఇప్పుడు పోలవరంను త్రీడీ మ్యాప్ ప్రాజెక్టుగా మార్చారు!: విజయసాయిరెడ్డి

  • పోలవరం ఆయనకు బంగారు బాతుగా మారింది
  • వైఎస్ రూ.15 వేల కోట్లతో పోలవరం చేపట్టారు
  • బాబు దాన్ని రూ.58,000 కోట్లకు తీసుకెళ్లారు
పోలవరం ప్రాజెక్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి బంగారు బాతులా మారిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆయన ఎన్నటికీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయబోరని విమర్శించారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.15,000 కోట్లతో పోలవరం నిర్మాణాన్ని ప్రారంభించారని సాయిరెడ్డి గుర్తుచేశారు. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దాని వ్యయాన్ని రూ.40,000 కోట్లకు తీసుకెళ్లారనీ, తాజాగా ఇప్పుడు రూ.58,000 కోట్లకు చేర్చారని ఆరోపించారు.

పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించిన తర్వాత కూడా దాని నిర్మాణ వ్యయాన్ని చంద్రబాబు 2200 రెట్లు పెంచారనీ, ఈ వ్యవహారంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) మొట్టికాయలు వేసిందని గుర్తుచేశారు. ఇప్పటివరకూ సగం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా పూర్తిచేయని చంద్రబాబు వచ్చే ఏడాదికల్లా పోలవరం ప్రాజెక్టును ప్రారంభిస్తామని కోతలు కోస్తున్నారని మండిపడ్డారు. అనుభవం లేదన్న విషయం తెలిసీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి పోలవరం కాంట్రాక్టును చంద్రబాబు కట్టబెట్టారని దుయ్యబట్టారు. అమరావతి తర్వాత పోలవరంను కూడా త్రీడీ మ్యాపింగ్ ప్రాజెక్టుగా మార్చారని ఎద్దేవా చేశారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
polavaram
Jagan
Vijay Sai Reddy

More Telugu News