వైద్యం అందక గాంధీ ఆసుపత్రిలో నా స్నేహితుడు చనిపోయాడు.. ఏం చేయమంటారు కేటీఆర్ సార్?: దర్శకుడు నాగ్ అశ్విన్ ఆవేదనాభరిత ట్వీట్

  • గాంధీ ఆసుపత్రిలో ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేడు
  • రాజధానిలోని ప్రభుత్వాసుపత్రిలో మనుషుల ప్రాణాలను ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం?
  • ఎవరిని ప్రశ్నించాలో కూడా నాకు అర్థం కావడం లేదు
హైదరాబాదులోని ప్రభుత్వ ఆసుపత్రుల తీరుపై సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ (మహానటి డైరెక్టర్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి తీరుతో తన స్నేహితుడిని కోల్పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే, ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కెమెరామెన్ గా పని చేస్తున్న అశ్విన్ స్నేహితుడు గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆయనను గాంధీ ఆసుప్రతికి తరలించారు. అయితే, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆయన మరణించాడు. ఈ అంశంపై మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ జరిగిన దారుణాన్ని అశ్విన్ వివరించారు.

'ప్రమాదం జరిగిన వెంటనే నా స్నేహితుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మూడు గంటల పాటు అతను చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాడు. ఆదివారం కావడంతో డాక్టర్లు అందుబాటులో లేరు. అతని తల్లిదండ్రులే అతన్ని స్ట్రెచర్ పై పడుకోబెట్టి... అటు, ఇటు మోసుకుంటూ తిరిగారు. గాంధీ ఆసుపత్రికి కాకుండా మరే ఆసుపత్రికి తీసుకెళ్లినా అతను బతికేవాడు. రాజధాని నగరమైన హైదరాబాదులోని ప్రభుత్వ ఆసుపత్రిలో మనుషుల ప్రాణాలను ఎందుకు కాపాడుకోలేక పోతున్నాం?

కేటీఆర్ సార్.. ప్రభుత్వాసుపత్రి చావులకు, నిర్లక్ష్యానికి పర్యాయపదం కాదని చెప్పడానికి ఏం చేయమంటారు? వైద్యం అందక చనిపోయిన నా స్నేహితుడు రాష్ట్రంలోనే గొప్ప కెమెరామెన్. దీనిపై ఎవరిని ప్రశ్నించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. వైద్యం అందక ఎవరూ చనిపోరాదు' అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 
Go Back to Shorts
nag ashwin
director
tollywood
friend
cameramen
dead
gandhi hospital
KTR

More Telugu News