కేసీఆర్ పై పోటీ చేస్తున్న వంటేరు ప్రతాపరెడ్డి ఆమరణదీక్ష!
- గజ్వేల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట ఆమరణదీక్ష
- తన కుటుంబసభ్యల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ ఆగ్రహం
- పోలీసులు రెచ్చిపోతున్నారని.. ఒత్తిడి తట్టుకోలేకే దీక్షకు దిగానన్న వంటేరు
గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డి ఆమరణదీక్షకు దిగడం సంచలనం రేపుతోంది. గజ్వేల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట ఆయన ఆమరణదీక్షను ప్రారంభించారు. తన కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని... తమను ఎక్కడికక్కడ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రెచ్చిపోతున్నారని... వారి ఒత్తిడిని తట్టుకోలేకే దీక్షకు దిగానని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి ప్రాణ త్యాగానికి కూడా తను సిద్ధమేనని అన్నారు. అవసరమైనే ఆత్మాహుతి చేసుకుంటానని హెచ్చరించారు.