- జగన్ పై దాడికి పాల్పడిన వ్యక్తి వైసీపీ అభిమానట
- ఉద్దేశపూర్వకంగా ఈ దాడి చేసినట్టు కనబడటం లేదట
- డీజీపీ వ్యాఖ్యలు సబబు కాదు
జగన్ పై దాడికి పాల్పడిన వ్యక్తి వైసీపీ అభిమాని అని, ఉద్దేశపూర్వకంగా ఈ దాడి చేసినట్టు కనబడటం లేదని ఏపీ డీజీపీ ఠాకూర్ చెప్పడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ డీజీపీ ఈ కేసును కూలంకషంగా పరిశీలించినట్టయితే ఈ విధంగా ఆయన మాట్లాడేవారు కాదేమోనని, కాపీ కొట్టి ఐపీఎస్ ఎగ్జామ్ ఆయన పాసయ్యాడేమోనంటూ ఠాకూర్ పై విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తామేమీ రాజకీయ ప్రకటనలు చేయడం లేదని, వాస్తవాలు మాత్రం చెబుతున్నామని, జగన్ కు తగిన భద్రత కల్పించమని, మంచి వాహనాలను ఇవ్వమని మొదటి నుంచి తాము విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
టీడీపీ అధిష్ఠానం, పోలీస్ అధికారుల్లో కొందరు కలిసి జగన్ ని అణగదొక్కాలని చూస్తున్నారని, ఆ ప్రయత్నాలు నెరవేరవని, తమ పార్టీ అధ్యక్షుడు జగన్ కు భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయని అన్నారు.