అమెరికా, రష్యాలకు ఇక పీడకలే.. హెచ్చరించిన ఐసిస్ చీఫ్ బగ్దాదీ!
- పశ్చిమ దేశాలపై దాడులకు పిలుపు
- భవిష్యత్ లో విజయం సాధిస్తామన్న బగ్దాదీ
- 2017లోనే చనిపోయినట్లు ప్రకటించిన రష్యా
అమెరికా, రష్యాల నేతృత్వంలోని సైన్యాలు సిరియా, ఇరాక్ లో ఐసిస్ అధీనంలోని 90 శాతానికి పైగా భూభాగాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బక్రీద్ పర్వదిన సందర్భంగా బగ్దాదీ ఆడియో టేప్ ను విడుదల చేశాడు. పశ్చిమ దేశాలపై దాడులకు తెగబడాలని అందులో ఉగ్రవాదులకు పిలుపునిచ్చాడు. జిహాద్ లో ఇప్పుడు నష్టపోయినా భవిష్యత్ లో కచ్చితంగా విజయం దక్కుతుందని ఉగ్రమూకలకు ధైర్యం నూరిపోశాడు. అమెరికా, రష్యాలు ఇక భయంకరమైన దాడులకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు. ఈ మేరకు అరబ్, ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లోని తన అనుచరులకు బగ్దాదీ సందేశం పంపాడు.
2014లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఐసిస్ సిరియా, ఇరాక్ లో గణనీయమైన భూభాగాన్ని అక్రమించుకుని ఈ ప్రాంతాన్ని ఇస్లామిక్ స్టేట్(ఇస్లామిక్ రాజ్యంగా) ప్రకటించింది. మతం మారని వేలాది మంది మైనారిటీలను ఊచకోత కోసి హతమార్చింది. దీంతో బగ్దాదీ ఆచూకీ చెప్పినవారికి రూ.175.16 కోట్ల బహుమతి ఇస్తామని గతంలోనే అమెరికా ప్రకటించింది. గతేడాది తాము జరిపిన వైమానిక దాడుల్లో బగ్దాదీ చనిపోయాడని అప్పట్లో రష్యా సైన్యం తెలిపింది. ఈ నేపథ్యంలో బగ్దాదీ ఆడియో విడుదల చేయడం గమనార్హం.