నిద్రపోతున్నట్టు నటిస్తున్న చంద్రబాబును లేపడం మా వల్ల కాదు: పురందేశ్వరి

  • రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులు
  • పట్టనట్టు నటిస్తున్న ప్రభుత్వం
  • బీజేపీ మహిళా మోర్చా సమావేశంలో పురందేశ్వరి
నిద్రపోతున్న వారిని లేపవచ్చుగానీ, నిద్రపోతున్నట్టు నటిస్తున్న చంద్రబాబు వంటి వారిని లేపడం తమ వల్ల కాదని భారతీయ జనతా పార్టీ నేత దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగగా, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరిగిపోయాయని, అవేవీ పట్టనట్టు ప్రభుత్వం నటిస్తోందని ఆరోపించారు.

మహిళలకు కేంద్రం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని దుయ్యబట్టిన ఆమె, కేంద్రం నిధులను తన నిధులుగా చెప్పుకుంటున్న ఘనత చంద్రబాబుదని అన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం కట్టుబడే ఉందని, ఇనుప ఖనిజం, రహదారులు, మౌలిక వసతులు తదితరాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పదేపదే కేంద్రం అడుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదని విమర్శలు గుప్పించారు. మెకాన్ సంస్థతో కూర్చుని చర్చించి, సమగ్ర నివేదికను ఇస్తే, ముందడుగు పడుతుందని అన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
BJP
Mahila Morcha
Purandeshwari

More Telugu News