నా సోదరుడి వ్యాఖ్యలు బాధ కలిగించాయి: పురందేశ్వరి

  • కర్ణాటకలో బీజేపీ తరఫున పురందేశ్వరి ప్రచారం
  • బాలయ్య వ్యాఖ్యలను సభ్యసమాజం ఆమోదించదు
  • ప్రధానిని అసభ్య పదజాలంతో దూషిస్తారా?
  • కన్నడ ఓటర్లు మార్పు కోరుతున్నారన్న బీజేపీ మహిళా నేత
భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఇటీవల తన సోదరుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొప్పళ జిల్లా గంగావతి ప్రాంతానికి వచ్చిన ఆమె, బాలయ్య వ్యాఖ్యలను సభ్యసమాజం ఆమోదించదని అన్నారు.

రాజ్యాంగ బద్ధమైన ఉన్నత పదవిలో ఉన్న మోదీని అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించిన ఆమె, కన్నడనాట స్థిరపడిన తెలుగువారు విజ్ఞులని, పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరు మెరుగైన వారో బేరీజు వేసుకుని గెలిపించాలని కోరారు. పక్క రాష్ట్రాల నేతలు మీ కష్టాలను తీర్చలేరని వ్యాఖ్యానించిన ఆమె, ఓటర్లు మార్పును కోరుకుంటున్నారని, అది బీజేపీతోనే సాధ్యమని అన్నారు. తుంగభద్ర రిజర్వాయరులో నీరున్నప్పటికీ, సమయానికి నీటి విడుదల జరగక రైతులు ఒక్క పంటకు కూడా నోచుకోవడం లేదని విమర్శించారు. కాగా, పురందేశ్వరికి గంగావతి తాలూకా బాపిరెడ్డి క్యాంపులో గ్రామస్థులు స్వాగతం పలికారు.
Go Back to Shorts
Karnataka
Assembly Elections
Purandeshwari
Balakrishna

More Telugu News