పవన్ కల్యాణ్ కంటికి ఇన్ ఫెక్షన్... నేటి అనంతపురం పర్యటన రద్దు!

జనసేన అధినేత పవన్ కల్యాణ్, నేడు అనంతపురం జిల్లాలో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన ఎడమ కంటికి డస్ట్ ఇన్ ఫెక్షన్ సోకడంతో, డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన మీదట పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, అనంతపురం జిల్లాపై ప్రత్యేక దృష్టిని సారించిన పవన్, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

అందులో భాగంగానే జిల్లాలో క్షేత్ర స్థాయిలో జనసేనను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టిన ఆయన, ఇప్పటికే పలుమార్లు అనంతపురం, హిందూపురం తదితర పట్టణాల్లో పర్యటనలు జరిపారు. జనవరి 28 నుంచి మూడు రోజులపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు కూడా. అనంతపురంలో పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేయగా, ప్రస్తుతం దాని నిర్మాణం శరవేగంగా సాగుతోంది. అనంతపురం పట్టణ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయవచ్చని కూడా ఊహాగానాలు వస్తున్నప్పటికీ, వాటిపై అధికారిక సమాచారం లేదు.


More Telugu News