తాజ్‌మహల్ దత్తతకు ప్రముఖ కంపెనీల పోటీ....!

  • తాజ్ మహల్ దత్తతకు ఐటీసీ, జీఎంఆర్‌ల పోటీ
  • కేంద్ర ప్రభుత్వ అడాప్ట్ ఏ హెరిటేజ్ స్కీం కింద దత్తతకు ప్రయత్నాలు
  • ఎర్రకోటని కూడా దత్తత తీసుకుంటామని జీఎంఆర్..చార్మినార్‌నీ తీసుకుంటామని ఐటీసీ వెల్లడి
మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ పట్ల ప్రేమకు గుర్తుగా యమునా నదీతీరాన కట్టించిన పాలరాతి కట్టడం 'తాజ్‌మహల్‌'ను దత్తత తీసుకునేందుకు జీఎంఆర్, ఐటీసీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ ప్రేమమందిరాన్ని తాము దత్తత తీసుకుంటామంటూ ఆయా కంపెనీల ప్రతినిధులు కేంద్ర పర్యాటక శాఖకు లేఖలు కూడా రాశారు. గతేడాది సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం వారసత్వ కట్టడాల దత్తత కోసం 'అడాప్ట్ ఏ హెరిటేజ్' పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కీం కింద ప్రైవేటు, ప్రభుత్వ రంగ కంపెనీలు చారిత్రక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలను, కట్టడాలను దత్తత తీసుకోవచ్చు.

దత్తత కంపెనీలు తాము దత్తత తీసుకునే వాటి నిర్వహణ కోసం తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) బడ్జెట్‌లో 2 శాతాన్ని చెల్లించే అవకాశముంది. దత్తత తీసుకున్నప్పటికీ, కట్టడాలు మాత్రం కేంద్ర పురావస్తు శాఖ (ఏఎస్ఐ) అజమాయిషీలోనే ఉంటాయి. కాగా, తాజ్‌మహల్‌కి ఉన్న గొప్పతనం దృష్ట్యా దానిని ఈ స్కీంలో చేర్చలేదని ఏఎస్ఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఫిబ్రవరిలో బడ్జెట్‌ని ప్రవేశపెడుతూ దేశంలోని పది చారిత్రక ప్రాశస్త్యమున్న పది కట్టడాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు ప్రకటించింది.

తర్వాత తాజ్ మహల్‌ని కూడా ఈ స్కీమ్‌లో చేర్చడానికి ప్రభుత్వం నిర్ణయించుకుందని సదరు అధికారి చెప్పినట్లు 'హిందూస్థాన్ టైమ్స్' పత్రిక ఉటంకించింది. తాజ్ మహల్‌తో పాటు ఇతిమద్-ఉద్-దౌలాహ్ ఎర్రకోటలను కూడా దత్తత తీసుకునేందుకు పోటీ పడుతున్నట్లు జీఎంఆర్ ప్రతినిధి తెలిపారు. మరోవైపు ఐటీసీ కూడా ఆంధ్రప్రదేశ్‌లోని శిల్పకళా నైపుణ్యంతో అలరారుతున్న హిందూ దేవాలయాలు, హైదరాబాద్‌లోని చార్మినార్‌ను దత్తత తీసుకునేందుతు పోటీ పడుతోంది.
Go Back to Shorts
ITC Ltd
GMR Group
Adopt A Heritage' scheme
corporate social responsibility
Archaeological Survey of India (ASI)
Taj Mahal
Red Fort

More Telugu News