గుంటూరులో 38 డిగ్రీల ఉష్ణోగ్రత!
- గుంటూరు జిల్లాలో ప్రతాపం చూపుతున్న భానుడు
- ఉదయం 10 అయిందంటే బయటకు రావాలంటే భయం
- జిల్లాలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
ఇప్పటికే ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. డిగ్రీ పరీక్షలు కొనసాగుతున్నాయి. మరో రెండు వారాల్లో పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ఎండలు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత ఏడాది గుంటూరు జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదు కావడం కూడా ఉష్ణోగ్రతల తీవ్రతకు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బొల్లాపల్లి, నూజెండ్ల, వినుకొండ, మాచర్ల, దాచేపల్లి, పిడుగురాళ్ల, రెంటచింతల మండలాల్లో గత పది రోజులుగా ఉదయం 10 గంటలైందంటే రోడ్డు మీదకి వచ్చేందుకు స్థానికులు భయపడుతున్నారు. గతేడాది 46 డిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రతలు ఈ ఏడు మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని, పిల్లలు, వయసుమళ్లిన వారు ఎండలబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖాధికారులు సూచిస్తున్నారు.