న‌న్ను క్ష‌మించండి: లోక్‌స‌భ‌లో కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే

  • రాజ్యాంగాన్ని సవరించి లౌకికతత్వం అనే పదాన్ని తొలగిస్తామ‌ని ఇటీవ‌ల వ్యాఖ్య‌లు
  • కొంద‌రు నా వ్యాఖ్యలను వక్రీకరించారు
  • భార‌త‌ రాజ్యాంగాన్ని, పార్లమెంట్‌ను గౌరవిస్తాను
  • రాజ్యాంగమే నాకు అత్యున్నతం
తమ ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించి లౌకికతత్వం అనే పదాన్ని తొలగిస్తుందని ఇటీవ‌ల‌ కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. కర్ణాటకలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించి లౌకిక అనే పదంపై తన వ్యతిరేకతను చాటుకున్నారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై పార్లమెంట్‌ ఉభయసభల్లో విప‌క్ష స‌భ్యులు భ‌గ్గుమ‌న్నారు. దీంతో సభలో అనంత్‌కుమార్ హెగ్డే క్షమాపణలు చెప్పారు.

అయితే, కొంద‌రు తన వ్యాఖ్యలను వక్రీకరించారని సదరు కేంద్రమంత్రి తెలిపారు. తాను భార‌త‌ రాజ్యాంగాన్ని, పార్లమెంట్‌ను, అంబేద్కర్‌ను గౌరవిస్తానని అన్నారు. రాజ్యాంగమే తనకు అత్యున్నతమని అందులో ఎటువంటి సందేహాలు వ‌ద్ద‌ని వ్యాఖ్యానించారు. తాను రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని, తాను ఎప్పుడూ అలా మాట్లాడబోన‌ని చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే వారికి క్షమాపణలు చెబుతున్నాన‌ని అన్నారు. 
Go Back to Shorts
ananth kumar hegde
parliament
sorry

More Telugu News