నేను భావోద్వేగాలను పట్టించుకోను...చరిత్రను చెబుతున్నాను.. అదే చెబుతాను: కంచె ఐలయ్య
- నేనెవరినీ కించపరుస్తూ పుస్తకాలు రాయను
- చరిత్రలో ఏం జరిగింది? చరిత్రలో ఏముంది? అని మాత్రమే చెబుతాను
- పురాతన సమాజాన్ని, సమాజ స్వరూపాన్ని, అప్పటి ఆలోచనలను మాత్రమే నా పుస్తకాల్లో ప్రతిబింబిస్తాను
- త్వరలో హరప్పా నాగరికత, ఆర్యుల దండయాత్రకు ముందున్న పరిస్థితుల గురించి పుస్తకం రాస్తాను
- పరిశోధన ఫలితాలను పుస్తకంగా రాస్తాను
ఆర్యుల దండయాత్రకు ముందున్న చరిత్రను రాయనున్నానని ఆయన అన్నారు. కౌటిల్యుడి అర్థశాస్త్రం, మనుధర్మశాస్త్రం నాటి తొలి పుస్తకాలని ఆయన అన్నారు. అయితే అవి రాసినవారెవరు? వారెందుకు ఇతర కులాలను కించపరిచారు? వాటిపై ఎవరైనా ఇంతవరకు క్షమాపణలు చెప్పారా? అని ఆయన ప్రశ్నించారు. చరిత్రలో జరిగినవి రాస్తే తనపై విమర్శలు చేస్తున్నారని ఆయన చెప్పారు.
రాముడుని ఒక రాజకీయ పార్టీ ముందుకు పెట్టి, శ్రీకృష్ణుడ్ని ఎందుకు వెనకకి పెట్టిందని ఆయన ప్రశ్నించారు. అలాగే కృష్ణుడికి 8 మంది భార్యలు ఉన్నారని, గోపికలతో సంబంధాలు ఉన్నాయని ఇలా నచ్చినట్టు రాశారని, వాటిపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఆర్యవైశ్యుల పుస్తకం విషయంలో తనపై ఒక ఆచార్యుడు ఆరోపణలు చేశాడని, ఆయనతో తాను నిర్మాణాత్మక చర్చకు సిద్ధమని ఆయన అన్నారు.