భారతీయుల దీక్ష, దక్షతలకు ప్రతిరూపంగా జ్యోతీప్రజ్వలన: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్

  • ప్రధాని పిలుపుకు ప్రతి స్పందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
  • కాంతి వెలుగులతో కరోనా చీకటికి ముగింపు తధ్యం
కరోనా మహమ్మారి నుండి భారతావనిని రక్షించుకునే క్రమంలో రాష్ట్ర ప్రజలంతా దీపాలు వెలిగించి తమలోని ఐక్యతను చాటటం ముదావహమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ మానసికంగా మనమంతా ఒక్కటేనన్న నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావటం మనలోని దీక్ష, దక్షతలను ప్రస్పుటింప చేస్తుందన్నారు. ప్రజలందరూ తమ తమ ఇళ్లల్లోని విద్యుత్ లైట్లన్నీ ఆపేసి, జ్యోతులు వెలిగించాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో  రాజ్ భవన్ లో గవర్నర్ దంపతులు బిశ్వ భూషన్ హరిచందన్, సుప్రవ హరిచందన్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 9 నిమిషాల పాటు గవర్నర్ దంపతులు జ్యోతులను వెలిగించి కరోనా వ్యాప్తి నిరోధం పట్ల తమ అంకాంక్షను ప్రపంచానికి చాటారు. గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాతో సహా అధికారులు, అనధికారులు, గవర్నర్ వారి వ్యక్తిగత రక్షణ సిబ్బంది ఇలా... అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని కారు చీకటిలో వెలుగును నింపారు.

 ప్రత్యేకించి రాజ్ భవన్ సెక్యురిటీ సిబ్బంది తమదైన శైలిలో క్రమశిక్షణతో దీపాల వెలుగులు ప్రసరింపచేసారు.  ఈ సందర్భంగా గవర్నర్ సందేశం ఇస్తూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లవద్దనే ఉండి ఇళ్లల్లోని విద్యుత్‌ దీపాలను ఆపేసి, జ్యోతులు వెలిగించి, తమ ధృఢ సంకల్పాన్ని వెల్లడించటం సహేతుకమైన పోరాటానికి నిదర్శనమన్నారు. జనతా స్ఫూర్తిని మరోమారు చాటుతూ, రాష్ట్ర ప్రజలు తమ విలువైన సమయంలో ఓ 9 నిమిషాలు దేశం కోసం కేటాయించటం అభినందనీయమన్నారు. చమురు దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్‌ లైట్లు, సెల్‌ఫోన్‌ ఫ్లాష్‌ లైట్లు ... ఇలా ఏదోక రూపంలో కాంతిని ప్రజ్వలింప చేసి కరోనా చీకటిని తరిమేద్దాం అన్న సంకల్పం ప్రదర్శించటం వల్ల భారతీయులు ఏదైనా సాధించగలరన్న విషయం ప్రపంచానికి చాటినట్లయ్యిందన్నారు.

More Press News