రానున్న నాలుగు రోజుల్లో గార్బేజ్ తొలగింపుకు స్పెషల్ డ్రైవ్: మంత్రి కేటీఆర్

Related image

  • కరోనా కట్టడిలో భాగంగా ముమ్మరంగా డిస్-ఇన్ఫెక్షన్ స్ప్రేయింగ్
హైదరాబాద్, ఏప్రిల్ 17: హైదరాబాద్ నగరంలో పేరుకుపోయిన చెత్తను రానున్న నాలుగు రోజుల్లోగా పూర్తిస్థాయిలో తొలగించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశించారు. ప్రతి సర్కిల్ లోని మెడికల్ ఆఫీసర్, డిప్యూటి కమిషనర్, సంబంధిత పారిశుధ్య అధికారులు ప్రతిరోజు ఉదయం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి పూర్తిస్థాయిలో గార్బేజ్ ను తొలగించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇందుకుగాను అవసరమైన అదనపు వాహనాలు, డంపర్లు, టిప్పర్లను సమకూర్చుకోవాలని మంత్రి ఆదేశించారు.

పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై రోజు ఉదయం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు డిస్-ఇన్ఫెక్షన్ స్ప్రేయింగ్ ముమ్మరంగా చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని  మంత్రి ఆదేశించారు. ఈ విషయమై మంత్రి కేటీఆర్ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ తో నేడు సమీక్షించారు. మున్సిపల్ శాఖ మంత్రి ఆదేశాల మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ నేడు సాయంత్రం జిహెచ్ఎంసి జోనల్, డిప్యూటి కమిషనర్లతో టెలీకాన్ఫ్ రెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ...సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ నిబంధనలను అనుసరించి నగరంలో డస్ట్ బిన్ లను తొలగించడం జరిగిందని, అయితే ఈ కేంద్రాల్లో ఏర్పడ్డ చెత్తను తొలగింపు సంతృప్తికరంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. రేపటి నుండి ఉదయం జోనల్, డిప్యూటి కమిషనర్లు, ఏ.ఎం.హెచ్.ఓ లు క్షేత్రస్థాయిలో పర్యటించి గార్బేజ్ ను తొలగించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాలైన మార్కెట్లు, బస్ స్టేషన్లు, పార్కులు, వ్యాపార ప్రాంతాల్లో గార్బేజ్ కనిపించకూడదని పేర్కొన్నారు.

బిన్ ఫ్రీ సిటీగా చేపట్టిన చర్యల వల్ల ఇంటింటి నుండి గార్బేజ్ సేకరణ మరింత పెరగాలని, ఇందుకుగాను అవసరమైన అదనపు స్వచ్ఛ ఆటోలను పొందేందుకు మహీంద్ర కంపెనీ యాజమాన్యంతో సంప్రదించాలని జిహెచ్ఎంసి కమిషనర్ కు సూచించారు. రహదారులు, వీధుల్లో చెత్త కనిపిస్తే ఏ మాత్రం సహించేదిలేదని, ఇందుకుగాను సంబంధిత ఏ.ఎం.హెచ్.ఓ లు, డిప్యూటి కమిషనర్లను బాధ్యులను చేయడం జరుగుతుందని ముఖ్య కార్యదర్శి హెచ్చరించారు.

ప్రధానంగా గార్బేజ్ వల్నరబుల్ కేంద్రాలపై ప్రధాన దృష్టి సాధించాలని పేర్కొన్నారు. చెత్త తొలగించిన కేంద్రాల వద్ద డిస్-ఇన్ఫెక్షన్ స్ప్రేయింగ్ చేపట్టాలని తెలిపారు. శానిటేషన్ సిబ్బందికి హ్యాండ్ గ్లోవ్స్ లు , శానిటైజర్, మాస్కులను తప్పనిసరిగా అందించాలని అన్నారు. డంపింగ్ యార్డ్ లు, ఇంటర్ మీడియట్ ట్రాన్స్ ఫర్ స్టేషన్లలో గార్బేజ్ ఎత్తివేతలో ఏవిధమైన సమస్యలు తలెత్తకుండా వాటి స్థాయిని పెంచాలని సూచించారు. రానున్న నాలుగు రోజులు ఉద్యమరూపంలో గార్బేజ్ తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొన్నారు.

కరోనా నేపథ్యంలో ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా నగరంలోని ప్రధాన కూడళ్లు, జనసంవర్థ ప్రాంతాలు, మార్కెట్లు, పార్కులు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా డిస్-ఇన్ఫెక్షన్ స్ప్రేయింగ్ ను చేపట్టాలని ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. డస్ట్ బిన్ లను తొలగించిన ప్రాంతాల్లో కూడా చెత్తను తొలగించిన అనంతరం స్ప్రేయింగ్ చేయాలని పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు గాను ఒక శాతం సోడియం హైపోక్లోరైట్ ద్రావకంతో కూడి స్ప్రేయింగ్ ను క్రమం తప్పకుండా చేపట్టాలని అన్నారు.

ఇందుకుగాను సోడియం హైపోక్లోరైట్ తో పాటు అవసరమైన డిస్-ఇన్ఫెక్షన్ మందులను తగు మొత్తంలో ముందస్తుగా సేకరించాలని ఆదేశించారు. మృతదేహాల వల్ల ఏవిధమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకుగాను శ్మశానవాటికల్లో తగు నీటి లభ్యత, సరైన లైటింగ్ తదితర సౌకర్యాలను ఉండేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. కాగా నేడు ఉదయం నుండే నగరంలో ముమ్మర పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, గార్బేజ్ తొలగింపుపై  ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జిహెచ్ఎంసి కమిషనర్ వివరించారు.

ప్రతి రోజు ఉదయం గార్బేజ్ తొలగింపుకు నియమించిన వాహనాలు సక్రమంగా వస్తున్నాయా...లేనిది సంబంధిత జోనల్, డిప్యూటి కమిషనర్లచే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

More Press Releases