'సింబా' (ఆహా) మూవీ రివ్యూ!

  • జగపతిబాబు ప్రధాన పాత్రగా 'సింబా'
  • ఆగస్టు 9న విడుదలైన సినిమా 
  • బలహీనమైన కథాకథనాలు 
  • వినోదపరమైన అంశాలకు దూరంగా నడిచే కథ 

జగపతిబాబు .. అనసూయ ప్రధానమైన పాత్రలను పోషించిన 'సింబా' సినిమా, ఆగస్టు 9వ తేదీన థియేటర్లకు వచ్చింది. స్క్రీన్ ప్లే - మాటలు అందించింది దర్శకుడు సంపత్ నంది. ఈ సినిమాకి ఆయన ఒక నిర్మాత కూడా. ఈ సినిమాకి మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటన్నది ఇప్పుడు చూద్దాం. 

అక్ష (అనసూయ) హైదరాబాద్ లోని ఒక స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. వీల్ చైర్ కి పరిమితమైన భర్తను .. పాపను చూసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఒక టీచర్ గా ఆమెకి మంచి పేరు ఉంటుంది. అలాంటి అక్ష .. లోకేశ్వర్ రావు అనే ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేస్తుంది. ఆ తరువాత ఆమె చాలా కూల్ గా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది.

ఆ తరువాత ఆమె తన ఫ్యామిలీతో కలిసి ఒక స్టోర్ కి వెళుతుంది. అక్కడ ఆమెకి సుబ్రమణ్యం తారసపడతాడు. అతనిని కూడా ఆమె చంపుతుంది. ఈ హత్యలో ఆమెకి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఫాజిల్ (శ్రీనాథ్) సాయపడతాడు. ఏసీపీ అనురాగ్ ( వశిష్ట సింహా) సీసీ టీవీ పుటేజ్ ను పరిశీలిస్తాడు. ఆ వెంటనే అక్ష - ఫాజిల్ ను పోలీసులు అరెస్టు చేస్తారు. చనిపోయిన ఇద్దరికీ ప్రముఖ పారిశ్రామిక వేత్త పార్థ (కబీర్ దుహాన్ సింగ్)తో సంబంధం ఉంటుంది. 


దాంతో ఆయన ఆ ఇద్దరినీ ఎన్ కౌంటర్ చేయమని పోలీసులపై ఒత్తిడి తెస్తుంటాడు. ఆ ఇద్దరి సంగతి తాను చూసుకుంటానని చెప్పి, పార్థ తమ్ముడు రంగంలోకి దిగుతాడు. అదే సమయంలో ఒక ముఖ్యమైన సర్జరీ చేయడం కోసం విదేశాల నుంచి డాక్టర్ ఇరానీ హైదరాబాద్ వస్తాడు. ఒక శ్రీమంతుడి తనయుడికి సర్జరీ చేసి తిరిగి బయల్దేరతాడు. అదే రూట్లో అక్ష - ఫాజిల్ ను పోలీసులు తరలిస్తుండగా  పార్థ తమ్ముడు ఎటాక్ చేస్తాడు. 

అతనిపై ఒక్కసారిగా అక్ష - ఫాజిల్ విరుచుకుపడతారు. ఆ దృశ్యం చూసిన డాక్టర్ ఇరానీ కూడా వెళ్లి ఆ ఇద్దరితో కలిసి పార్థ తమ్ముడిని హత్య చేస్తాడు. ఈ  సంఘటనను చుట్టుపక్కలవారు వీడియో తీయడంతో అది క్షణాల్లో వైరల్ అవుతుంది. దాంతో అతణ్ణి కూడా అరెస్ట్ చేస్తారు. ముగ్గురూ కూడా అంతకుముందు నేర ప్రవృత్తి లేనివారే. తమకేమీ తెలియదనీ, ఆ క్షణంలో ఏం జరిగిందో తమకి గుర్తులేదనే ముగ్గురూ చెబుతారు.        

దాంతో ఎందుకు వీళ్లు ఇలా ప్రవర్తిస్తున్నారనేది పోలీసులు పరిశీలిస్తూ వెళతారు. ఈ ముగ్గురికీ కొన్ని రోజుల క్రితం సర్జరీలు జరిగాయనే విషయం బయటపడుతుంది. పురుషోత్తమ్ రెడ్డి అనే వ్యక్తి అవవయవాలను ఈ ముగ్గురికి అమర్చడం జరిగిందని తెలుసుకుంటారు. పురుషోత్తమ్ రెడ్డి ఎవరు? ఆయన ఎలా చనిపోయాడు? ఆ నేపథ్యం ఏమిటి? అనేది మిగతా కథ.

ఈ కథలో హీరో .. హీరోయిన్ అనేవాళ్లు ఉండరు. అందువలన డ్యూయెట్లకు అవకాశమే లేదు. అలాగే కామెడీని కూడా టచ్ చేసే ప్రయత్నం చేయలేదు. మెయిన్ లైన్ ఏదైతో ఉందో దానినే నడిపిస్తూ వెళ్లాడు. అందువలన కథ మొదటి నుంచి చివరివరకూ సీరియస్ గానే సాగుతూ ఉంటుంది. ఒక టీచర్ .. ఒక డాక్టర్ .. ఒక జర్నలిస్ట్ హత్యలు చేయడం .. తమకేమీ తెలియదనడం, ఆ దిశగా సాగిన ఇన్వెస్టిగేషన్ ఆకట్టుకుంటాయి. 

ఇక ఈ కథలో మొక్కల పెంపకం .. చెట్లను కాపాడటం అనే ఒక బలమైన అంశం చోటుచేసుకుంది. ఈ అంశం తప్పకుండా ఆలోచింపజేస్తుంది. అయితే సస్పెన్స్ ను .. సందేశాన్ని కలుపుకుంటూ వెళ్లే వినోదపరమైన అంశాలు మాత్రం కనిపించవు. జరుగుతున్న హత్యలు .. అందుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అంత ఎఫెక్టివ్ గా అనిపించవు. జగపతిబాబు - కబీర్ దుహాన్ సింగ్ పాత్రలు  ఎదురుపడిన తరువాత వచ్చే సన్నివేశాలు కూడా రొటీన్ గా ఉంటాయి.

 కృష్ణప్రసాద్ ఫొటోగ్రఫీ .. కృష్ణ సౌరభ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. తమ్మిరాజు ఎడిటింగ్ ఓకే. కథపై మరింత కసరత్తు చేసి, వినోదపరమైన అంశాలను జోడిస్తే, కంటెంట్ ఇంకాస్త బెటర్ గా ఉండేదేమో అనిపిస్తుంది. 

Movie Details

Movie Name: Simba

Release Date: 2024-09-06

Cast: Jagapathi Babu, Kabeer Duhaan Singh, Anasuya, Vashishta Simha, Srinath, Anish Kuruvilla

Director: Murali Manohar Reddy

Producer: Rajendra Redy- sampath Nandi

Music: Krishna Sourabh

Banner: Bhavani Movies

Review By: Peddinti

Simba Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews