యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాలు చేసే కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తొలిసారిగా నటించిన హార్‌ర్‌ థ్రిల్లర్‌ చిత్రం 'కిష్కిందపురి'. ట్రైలర్‌, ఇతర ప్రమోషనల్‌ కంటెంట్‌తో సౌండ్‌ చేసిన ఈ సినిమా మంచి బజ్‌నే సంపాందించుకుంది. ఈ శుక్రవారం ప్రేక్షకులు ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? హారర్‌ సినిమాలో బెల్లంకొండ పర్‌ఫార్మెన్స్‌ ఎలా ఉంది? బెల్లంకొండకు హిట్‌ పడిందా? లేదా రివ్యూలో తెలుసుకుందాం. 

కథ: రాఘవ్‌ (బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌), మైథిలి (అనుపమ) ఇద్దరూ సహజీవనం చేస్తున్న ప్రేమికులు. వీరికి వున్న మరో స్నేహితుడు సుదర్శన్‌.  ఓ ఏజెన్సీతో కలిసి వీళ్లు హాంటెడ్‌ హాసెస్‌ టూర్స్‌ని నిర్వహిస్తుంటారు. దెయ్యాలను చూడాలనుకునే ఆసక్తి, ఆ థ్రిల్ల్‌ను అనుభవించాలని కోరుకునే వాళ్లు ఈ టూర్స్‌కు వస్తుంటారు. ఏదైనా పాడుబడిన భవనానికి తీసుకెళ్లి దెయ్యాలను ఉన్నాయని నమ్మించడమే వీళ్ల మెయిన్‌ ఎజెండా. అలా ఓ సారి కొంత మందితో కలిసి కిష్కిందపురి అనే ఊరి చివర్లో ఉన్న సువర్ణమాయ అనే రేడియో స్టేషన్‌కు వెళతారు. 1989 నుంచి మూతపడిన స్టేషన్‌ ఇది. ఆ రేడియో స్టేషన్‌లో దెయ్యాలు ఉన్నాయనేది ఆ ఊరి వాళ్ల నమ్మకం. ఇక ఆ సువర్ణమయాలోకి అడుగుపెట్టిన వాళ్లకు అక్కడ  భయానక పరిస్థితులు ఎదురవుతాయి. అక్కడ రేడియోలో మిమ్ములను ఎవరినీ వదిలిపెట్టను అనే వాయిస్‌ వినిపిస్తుంది. అనుకున్నట్లుగానే సువర్ణమాయకు వెళ్లిన వాళ్లలో ముగ్గురు చనిపోతారు. ఇక ఈ విషయం తెలుసుకున్న రాఘవ్‌ ఏం చేశాడు? మిగతా వారిని ఆ దెయ్యం నుంచి ఎలా కాపాడాడు? అసలు వేదవతి ఎవరు? విశ్రవపుత్ర ఎవరు? ఆయనకు దెయ్యానికి ఉన్న సంబంధం ఏమిటి? సువర్ణమాయలోకి అడుగుపెట్టిన వాళ్లను ఆ దెయ్యం ఎందుకు చంపుతుంది అనేది మిగతా కథ. 

విశ్లేషణ: ఇప్పటి వరకు వచ్చిన హారర్‌ చిత్రాలతో పోలిస్తే ఇది కాస్త డిఫరెంట్‌ హారర్‌ మూవీనే. కానీ ఈ సినిమాకు కథకు తగ్గ ఎగ్జిక్యూషన్‌ లేకపోవడమే ప్రధాన మైనస్‌. హారర్‌, థ్రిల్లింగ్‌ అంశాలతో తొలిసగంలో దెయ్యాన్ని చూపిస్తూ భయపెట్టడం, రెండో భాగంలో దెయ్యం వెనుక ఉన్న కథను చెప్పడం అనే అంశాల మీదే దర్శకుడు ఫోకస్‌ చేశాడు. అయితే ఆసక్తికరమైన కథ, కథనాలను రాసుకోవడం ఆయన విఫలమయ్యాడు. కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకులను భయపెట్టడంలో సక్సెస్‌ అయినా, సినిమా ఆద్యంత ఆ భయాన్ని, ఆ థ్రిల్లింగ్‌ను పంచడంలో ఫెయిల్‌ అయ్యాడు. సినిమాలో ఎక్కడా కూడా లాజిక్‌లను పాటించలేదు. ఇలాంటి సినిమాలకు థ్రిల్ల్‌ని అందించాలంటే కొన్ని కొత్త సన్నివేశాలు అవసరం. సినిమా చూస్తున్నంత సేపు గతంలో హారర్‌ సినిమాలో చూసిన సన్నివేశాలే గుర్తుకొస్తాయి. రైలులో ఉన్న ఇద్దరు లోకో పైలైట్‌లను చంపే సన్నివేశం మాత్రం అందరి వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అయితే రెగ్యులర్‌గా హారర్‌ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఈ సినిమా పెద్దగా రుచించదు. ఫస్ట్‌హాప్‌ పర్వాలేదనిపించినా, సెకండాఫ్‌ మాత్రం విసుగు పుట్టిస్తుంది. పతాక సన్నివేశాలు మాత్రం రీజన్‌బుల్‌ వాచ్‌లా అనిపిస్తాయి. హారర్‌ సినిమాలు ఇష్టపడే వారిని మాత్రం 'కిష్కిందపురి' ఓ మోస్తరుగా ఆకట్టుకుంటుంది. 

నటీనటుల పనితీరు: రాఘవ్‌గా బెల్లంకొండ నటనలో మెప్పిస్తాడు. ప్రేక్షకులకు ఓ కొత్త సినిమా అందించాలనే తపన ఆయనలో కనిపించింది. కొత్త జానర్‌లో నటిస్తూనే తన బలాలైన యాక్షన్, డ్యాన్సులను మిస్‌ కాలేదు. మైథిలిగా అనుపమ కూడా నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలో ఆకట్టుకుంది. కొరియోగ్రాఫర్‌ శాండీ మాస్టర్‌ పోషించిన విశ్రవపుత్ర పాత్ర భయంకరంగా ఉంది. హైపర్‌ ఆది, సుదర్శన్‌లు నవ్వించడానికి కనీస ప్రయత్నం చూడా చేయలేదు. సాంకేతిక నిపుణుల విషయానికొస్తే సామ్‌ సీఎస్‌ సంగీతం, నేపథ్య సంగీతం ఓ హారర్‌ చిత్రానికి ఎంత ప్లస్‌ కావాలో అంత ప్లస్‌ అయ్యింది. ఎడిటింగ్‌ మరింత పదునుగా ఉండాల్సింది ఎందుకుంటే కేవలం రెండు గంటల నిడివి ఉన్న ఈ సినిమా చాలా స్లోగా కొనసాగుతున్న ఫీలింగ్‌ వచ్చింది. దర్శకుడు కథకు తగ్గ కథనం రాసుకోవడలో విఫలం కావడంతో 'కిష్కిందపురి' ఓ మోస్తరు సినిమాగా ఉండిపోయింది.